సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : పార్టీలు ఏవైనా..జెండాలు ఏవైనా ముదిరాజుల చైతన్యం, జాతి ప్రయోజనాలే తమకు ముఖ్యమని, హక్కుల కోసం తెగించి కొట్లాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే ముదిరాజ్ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మహాసభ నియోజకవర్గ అధ్యక్షులు అంచె రాములు ముదిరాజ్ ఆధ్వర్యంలో బడుగు బలహీన, బహుజన వర్గాల ఆశా జ్యోతి, వీరుడు, ముదురాజుల ఆత్మ బంధువు పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రముఖ యాంకర్, కమెడియన్ బిత్తిరి సత్తి ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నియోజకవర్గం ముదిరాజులను ఉద్దేశించి మాట్లాడుతూ... జెండాలు ఏవైనా మన ముదిరాజుల ఎజెండా రాజ్యాధికారం సాధించుకోవడం ఒక్కటేనని గుర్తు చేశారు. ఇందుకోసం వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనపెట్టి, అందరూ కలిసి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీల జెండాలు పక్కనపెట్టి ముదిరాజుల ఐక్యత, జాతి చైతన్యం కోసమే కదలాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నైనా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ముదిరాజ్ ల ఆశయాన్ని నెరవేర్చుకోవాలని అన్నారు. నేను, నువ్వు అనుకోకుండా, పండుగ సాయన్న లాంటి వీరుడు పనులను, మాటలను గుర్తు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. విగ్రహాలు ఏర్పాటు అనేది మా ఆశయాలను, పోరాటాలను గుర్తు చేసుకునేందుకే అని అన్నారు. హక్కులు ఎలా సాధించుకోవాలో బహుజన వీరుడు పండుగ సాయన్నను చూసి వారి ధైర్య సాహసాలను పునికి పుచ్చుకోవాలని సూచించారు. నాడు పెత్తందారుల దురహంకారాలను, నిరంతశత్వానికి వ్యతిరేకంగా పోరాడి బీదల క్షేమము కోసం పాటుపడిన వ్యక్తి పండుగ సాయన్న అని కొనియాడారు. పండగ సాయన్నను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని హక్కుల కోసం తెగించి కొట్లాడాలని సూచించారు. మన చరిత్ర ఎవరు రాయారని మన చరిత్ర మనమే రాసువాలని అన్నారు. ప్రస్తుతం కాలం మారిందని ప్రాణం ఇచ్చుడు త్యాగం చేయుడు వద్దని, గేరగిసి ఎదిరించాలని అన్నారు. పార్టీలు మనల్ని వాడుకోవడం కాదు మనమే తెలివిగా పార్టీలను వాడుకోవాలని అన్నారు. మనం ఎలా కొట్లాడాలో, ఎలా గెలవాలో పండుగ సాయన్న చరిత్రను చదివి నేర్చుకోవాలన్నారు. ఎక్కడ చూసినా 65 వేల నుండి 40వేల సంఖ్యలో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల సంఖ్య ఉందని అన్నారు. నాలుగు కోట్ల జనాభాలో 45 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని అన్నారు. దరఖాస్తు దండాలు అవసరం లేదని గెలిచే సత్తా మనకు మాత్రమే ఉందని, మనకు మనమే పాలించుకోవాలని గుర్తు చేశారు. ముదిరాజుల రక్తంలోనే తిరుగుబాటు ఉందని, అన్యాయాన్ని సహించే తత్వం మనది కాకూడదని, ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం కోసం దేనికైనా సిద్ధం కావాలని అన్నారు. వీరుల ఆశయాలను పునికిపుచ్చుకోవాలని అన్నారు. మనం తలుచుకుంటే ఎంత పెద్ద జేజమ్మ అయిన దిగిరాక తప్పదని అన్నారు. ఎవరితో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. సాయన్న తమకు ఆదర్శం కావాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో ముదిరాజులు శాసించే స్థాయికి వచ్చారని అన్నారు. ఇప్పటికైనా ముదిరాజ్ సోదరులు అందరూ కలసి ముందుకు వచ్చి మనల్ని మనమే ఎలుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల నుండి అదేవిధంగా నియోజక వర్గంలోని అనేక గ్రామాల నుండి ముదిరాజ్ ప్రజలు భారీ ఎత్తున షాద్ నగర్ సభకు తరలి రావడం జరిగింది...
-----------------------
Admin