సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు ఎస్. మండలంలో గల పి.ఏ.సి.ఎస్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం చివరి గింజను కొనుగోలు చేస్తామని తడిసిన ధాన్యం వలన రైతులు అధైర్య పడవద్దని అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాల వలన ధాన్యం తడవకుండా ముందస్తుగా తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచామని కురుస్తున్న వర్షాల వలన ఎక్కడ కూడా రైతులు తెచ్చిన ధాన్యం తడవకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ మిల్లులకు పంపాలని, మిల్లర్లు వెంటనే వాహనాల్లో ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 31,335 మంది రైతుల నుండి 1,84,485.000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అలాగే రైతులకు ఇప్పటివరకు రూ. 225 కోట్లు చెల్లించామని అన్నారు.
-----------------------
Admin