సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమాన్ని పోలీసులను విడదీసి చూడలేమని తెలంగాణ ఉద్యమం పోలీసుల నరనరాన జీర్ణించుకొని ఉన్నదని షాద్ నగర్ ఏసిపి సీహెచ్ కుశాల్కర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక సీఐ నవీన్ కుమార్ నేతృత్వంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ తో పాటు అనేకమంది మండల, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మున్సిపాలిటీ నుండి ఇండోర్ స్టేడియం వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రన్ నిర్వహించారు. పోలీసులకు జై కొడుతూ వారి సేవలను ప్రశంసిస్తూ అమరవీరులకు జోహార్ చెబుతూ టూకే రన్ కొనసాగింది. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఎసిపి సిహెచ్ కుశాల్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఎందరో రోడ్డుపైకి వచ్చినప్పుడు వంటావార్పు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారి భద్రతతో పాటు అసాంఘిక శక్తులు ఉద్యమంలో చొరబడకుండా జాగ్రత్తలు తీసుకునే వారమని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ఆంధ్ర పాలకులు, అధికారుల చేతుల్లో ఎన్నో కష్టాలను స్వయంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఉద్యోగ నిర్వహణ విషయంలో ఇంకా ప్రమోషన్స్ విషయంలో అన్యాయానికి, అణచివేతకు గురైనట్టు ఏసిపి కుశాల్కర్ చెప్పారు. తెలంగాణ వచ్చాక పోలీసు శాఖలో తమకంటూ ఒక గౌరవం, హోదా లభించిందని అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు, అధికారులు తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయమని చెప్పినా తాము కూడా మానవతా దృక్పథంతో తెలంగాణ వాదులుగా ఉద్యమానికి అంతర్గతంగా సహకరించామని చెప్పుకొచ్చారు. కొన్ని కీలక సమయాల్లో ఉద్యమకారులపై కేసులు పెట్టకుండా కాపాడే వారమని అన్నారు. ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టన్న తుపాకీతో కాల్చుకుని తెలంగాణ కోసం అమరుడయ్యాడని గుర్తు చేశారు. కిష్టన్న తన వద్ద నాలుగు సంవత్సరాలు గన్ మెన్ గా పనిచేశాడని పేర్కొన్నారు. అప్పటి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారని అప్పట్లో తాము దీనిని అడ్డుకున్నట్లుగా చెప్పారు. తెలంగాణ కోసం కిష్టన్న పరితపించేవాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత పాలకుల సమయంలో ఎన్నో నక్సలైట్ల ఎన్కౌంటర్లలో పాలుపంచుకున్నామని గుర్తు చేసుకున్నారు. కానీ పనులు తాము చేసినా ప్రమోషన్లు మాత్రం ఆంధ్ర అధికారులకే దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక అందరికీ సమున్నత న్యాయం లభించిందని అన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రజలకు పరిపాలన చేతకాదని అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆంధ్ర పాలకులు ప్రచారం చేసే వారని అన్నారు. తెలంగాణ వస్తే నక్సలైట్ల చేతుల్లోకి వెళుతుందని అసాంఘిక శక్తులు మాఫియా చెలరేగే అవకాశాలు ఉన్నట్టు పరిస్థితులను కల్పించాలని అన్నారు. ఈ రెండు విషయాలను ఆనాడే గ్రహించిన ఉద్యమ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే పోలీసు శాఖలో ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదిగేలా చేశారని అన్నారు. దూరదృష్టిగల నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అందుకే నేడు విజయవంతంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. దేశంలోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయని అందరూ బాగుపడాలని కొనియాడారు. అసాంఘిక శక్తులను అణచివేస్తాం - సిఐ నవీన్ కుమార్. తెలంగాణలో అసాంఘిక శక్తులను పోలీసు శాఖ నిరభ్యంతరంగా అణచివేస్తుందని షాద్ నగర్ సిఐ నవీన్ కుమార్ అన్నారు. 2 కే రన్ కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోలీసులకు సముచితస్థానం లభించిందని అన్నారు. విధి నిర్వహణలో స్వేచ్ఛ ఉందని అసాంఘిక శక్తులను అణచివేయడంలో ప్రభుత్వ సహకారం గొప్పదని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవంతో పాటు టూ కే రన్ కార్యక్రమం కూడా చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నాటి ఉద్యమ పరిస్థితులను నెమరు వేసుకుంటూ నేడు అనుభవిస్తున్న ఫలాల గురించి వివరిస్తూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల శాంతిభద్రతల కోసమే పోలీసులు ఉన్నారని, అనునిత్యం వారిని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పోలీసు శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆట కట్టిస్తున్నట్టు చెప్పారు. చైన్ స్నాచింగ్ ను అంతమొందించామని వారిపై పిడి యాక్టులు పెట్టామని గుర్తు చేశారు. అనేక నేరాల అణచివేతలో పోలీసు శాఖ ప్రగతి ఉజ్వలంగా ఉందని అన్నారు.
-----------------------
Admin